వైసీపీ అధికారంలోకి రాగానే వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నం బస్టాండ్ లో ఈరోజు ఏర్పాటుచేసిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో ప్రతీ నిరుపేద కుటుంబాన్ని లక్షాధికారిని చేస్తానని హామీ ఇచ్చారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తామన్నారు.
రాష్ట్రంలో ప్రజల కష్టాలను, ఇబ్బందులను ప్రజాసంకల్పయాత్ర ద్వారా తెలుసుకున్నానని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే జన్మభూమి కమిటీలను రద్దుచేస్తానని జగన్ ప్రకటించారు. తల్లిదండ్రుల మీద చదువుల భారం పడకుండా చూస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా మార్చేస్తామని పేర్కొన్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి ఉమశంకర్ గణేష్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సత్యవతిని గెలిపించాలని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.