విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై కోడి కత్తి దాడి అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రావు ఏడునెలలుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు. ఈరోజు బెయిల్పై శ్రీనివాస్ విడుదలైన సందర్భంగా దాడికి గల కారణాలను వివరించారు.
జగన్పై హత్యాయత్నం కావాలని చేసిన ప్రయత్నం కాదని చెప్పుకొచ్చారు. సమస్యలు వివరించాలని వెళ్లి జగన్కు చెబుతుండగా కంగారులో కత్తి తగిలిందని తెలిపారు. నేను జగన్ అభిమానినని, అటువంటి తప్పు చేశానని నిరూపిస్తే తల నరుక్కొంటానని అన్నాడు. ఎయిర్ పోర్ట్ లో ఆరోజు ఘటనానంతరం అక్కడి వారు నన్ను కొడుతుంటే జగనే రక్షించారని అన్నారు. ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే జగన్ దయేనన్నారు. అటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.