telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

సీఎం జగన్ పర్యటనలో మంత్రి, ఎమ్మెల్యేల వివాదం

Jagan

ముఖ్యమంత్రి జగన్ అనంతపురం పర్యటనలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య వివాదం రేగింది. అనంతపురంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కంటి వెలుగుకు శ్రీకారం చుట్టారు. వరల్డ్ సైట్ డేను పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన నేత్రదాన శిబిరం, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, పోషణ్‌ అభియాన్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన స్టాళ్లను సందర్శించారు సీఎం. అయితే కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించేందుకు జగన్ అనంతపురం చేరుకున్న సమయంలో సీఎంకు మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిలు స్వాగతం పలికారు. అయితే హెలిపాడ్ దగ్గర జగన్‌‌కు స్వాగతం చెప్పే జాబితాలో తన పేరు లేకపోవడంపై తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారట. తన పేరు ఎందుకు లేదని మంత్రి శంకర్‌నారాయణ్‌ను ప్రశ్నించారట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్వల్ప వివాదం జరగ్గా.. జిల్లా నేతలు సర్థిచెప్పడంతో పరిస్థితి సద్ధుమణిగినట్లు తెలుస్తోంది.

Related posts