ఓ యువ ఎమ్మెల్యే నూతనంగా అసెంబ్లీకి ఎన్నిక అయ్యాడు. అలా పదవి లభించిందో లేదో ప్రభుత్వ అధికారిని ప్రజల ముందు గుంజీలు తీయించాడు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బిజూ జనతా దళ్ పార్టీకి చెందిన సరోజ్ కుమార్ మెహెర్, పాట్నాగఢ్ నియోజకవర్గం నుంచి మొదటి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆయన వివిధ గ్రామాలను సందర్శించారు.
ఈ క్రమంలో నాణ్యత లేని రోడ్లను గుర్తించిన ఎమ్మెల్యే.. సంబంధిత జూనియర్ ఇంజినీర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోడ్ల నాణ్యతను పరిశీలించడంలో విఫలమైనందుకు 100 గుంజీలు తీయాలంటూ ఆదేశించారు. తన ఆదేశాలు ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అనడంతో.. హడలెత్తిపోయిన ఇంజినీర్ ఎమ్మెల్యే సరోజ్ కుమార్ ముందు గుంజీలు తీశాడు. అంతేకాక గ్రామస్థులకు క్షమాపణ చెప్పించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.