అనాథలకు సేవ చేసే వారు చాలా మంది ఉండొచ్చు .. కానీ వారు చనిపోయాక అంత్యక్రియలు చేసేందుకు ఎవరు ముందుకు రారు. కానీ నగరానికి చెందిన యువకుడు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఇతడి సేవల గురించి తెలుసుకున్న అమెరికా కాలిఫోర్నియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బర్కలి వారు ఉత్తమ సమాజ సేవకు గాను డాక్టరేట్ అందించి సన్మానించారు. సికింద్రాబాద్ కార్ఖానా ప్రాంతానికి చెందిన గౌతం ఎంసీఏ చదివాడు. తన తండ్రి ఆర్మీలో ఉండి దేశ సేవ చేస్తుండటంతో తాను ఇక్కడ ప్రజల మధ్యలో ఉండి సేవ చేయాలనుకున్నాడు. దీని కోసం సర్వ్ నీడ్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా ఎందరికో సేవలు చేస్తున్నాడు. సుమారు 15 రకాల సేవా కార్యక్రమాలను గౌతం నిర్వహిస్తున్నాడు. ఇతడి సేవలు గుర్తించిన అమెరికాకు చెందిన జార్జియా అనే డాక్యుమెంటరీ రూపకర్త ప్రతి సంవత్సరం నగరానికి వచ్చి అనాథల అంత్యక్రియలలో పాల్గొంటుండటం విశేషం.
ఈ యువకుడు అనాథలకు తానే అన్నీ తానై నాలుగేండ్లుగా గౌతం అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 600 మందికి దహన సంస్కారాలను నిర్వహించినట్లు తెలిపాడు. తనకు అనాథ శరణాలయాల నుంచి చనిపోయిన వ్యక్తుల వివరాలను అందజేస్తారని, వారి మత సంప్రదాయాల మేరకు దహన సంస్కారాలు చేస్తున్నట్లు తెలిపాడు. గాంధీలో జరిగిన సంఘటనతో.. నాలుగేండ్ల క్రితం గాంధీ దవాఖాన రోగులకు, వారి సహాయకులకు అన్నదానం చేయడానికి గౌతం తన స్నేహితులతో వచ్చాడు. అక్కడ ఓ జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. అతడి అంత్యక్రియలు చేయడానికి భార్య తన పుస్తెలను అమ్మడం అతడ్ని కలచివేసింది. అప్పటి నుంచి అనాథలకు అంత్యక్రియలు చేయాలన్న కార్యాచరణ ప్రారంభం అయ్యిందని గౌతం తెలిపారు.