సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపిక పై దృష్టి సారించారు. జిల్లాలవారిగా సమీక్షలు నిర్వహించి బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తున్నారు. తాజాగా నంద్యాల, తిరుపతి పార్లమెంట్ స్థానాలకు ఇద్దరు పారిశ్రామికవేత్తలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుచుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ మన్నెం మధుసూదనరావు (ఎంఎంఆర్) ను తిరుపతి ఎంపీ సీటు కోసం జగన్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి వైసీపీలో చేరిన బ్రహ్మానంద రెడ్డికీ నంద్యాల ఖాయం అయినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన ఈ రెండు సీట్లలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ ఫిరాయించారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ మాత్రం వైసీపీ లోనే కొనసాగుతున్నారు. కానీ ఆయన అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో కొత్త నేతను కండువా కప్పి ఆహ్వానించిన జగన్ టికెట్ ఖాయం చేసినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వెలువడనున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకొన్నాయి. వారితో పాటుగా పలువురు సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు దాసరి బాలవర్థన్ రావు, చల్లా రామకృష్ణారెడ్డి సహా అనేక మంది వైసీపీలో చేరారు.