సినిమా ఆఫర్లు లేని శివాజీతో చంద్రబాబు వాజమ్మ ప్రకటనలు చేయిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో టీడీపీకి మద్దతుగా మాట్లాడిన నటుడు శివాజీపై సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలాంటి తప్పు చేయకుంటే ఐటీ గ్రిడ్స్ అధినేత అశోక్ ఎందుకు పరారీలో ఉన్నారని ప్రశ్నించారు. గతంలో గరుడపురాణం పేరుతో కథలు చెప్పిన శివాజీ.. ఇప్పుడు డేటా చోరీ వ్యవహారంలో పిచ్చి కూతలు కూస్తున్నాడని మండిపడ్డారు.
ఇలాంటి థర్డ్ గ్రేడ్ వ్యక్తులకు చంద్రబాబు ‘కీ’ ఇచ్చి ఆడిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం ఓట్ల తొలగింపుపై విచారణ చేపట్టకుండా యూటర్న్ తీసుకుందని విమర్శించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని బజారులో పెట్టిన టీడీపీ గుర్తింపును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.