ఏపీలోని ప్రధాన పార్టీలకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి.టిక్కెట్ల కోసం పోరులో ముఖ్యనేతలు సైతం పార్టీకి బైబై చెప్పేసి ప్రత్యర్థి పార్టీలో చేరిపోతున్నారు. తాజాగా, అనంతపురం సీనియర్ నేత పాటిల్ వేణుగోపాల్ రెడ్డి జగన్కు భారీ షాకిచ్చారు. తనతో సహా కుటుంబం మొత్తం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 18న అనంతపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్టు తెలిపారు.
మంత్రి కాల్వ శ్రీనివాసులు, పాటిల్ తనయుడు అజయ్కుమార్రెడ్డి, సోదరుడు సదాశివరెడ్డి పల్లేపల్లిలోని తమ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఎన్నికల్లో కాల్వ శ్రీనివాసులకు వ్యతిరేకంగా పని చేసినప్పటికీ ఎప్పుడూ ప్రతీకార చర్యలకు పాల్పడలేదని ఈ సందర్భంగా పాటిల్ పేర్కొన్నారు. మంత్రి కాల్వ మెరుగైన పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. పాటిల్ కుటుంబం రాకతో టీడీపీకి అదనపు బలం చేకూరినట్టు అయిందని కాల్వ శ్రీనివాసులు అన్నారు.