జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ భవన్ ముద్రించిన పుస్తకాన్ని జనసేన రిలీజ్ చేసిందని మండిపడ్డారు. ప్యాకేజీలు తీసుకుని పవన్ ఇంకా చంద్రబాబుకు పనిచేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
గతంలో పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా చంద్రబాబు బురదజల్లించారని.. ఇప్పుడు కూడా పవన్ ద్వారా సర్కార్పై విమర్శలు చేయిస్తున్నారన్నారు. ఇది మంచి పద్దతికాదని, ప్రజలే బుద్ధి చెబుతారని రోజా హితవు పలికారు. జగన్ ప్రభుత్వంపై బుక్ రిలీజ్ చేసిన పవన్.. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు గురించి ఎందుకు బుక్ విడుదల చేయలేదని ప్రశ్నించారు. జగన్ వందరోజుల పాలనలో అనేక సంక్షేమ పథకాలు అందించారని రోజా తెలిపారు.