రాబోవు ఎన్నికల్లో ఓట్ల కోసమే చంద్రబాబు వరాలజల్లు కురిపిస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య విమర్శించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా సీఎం చంద్రబాబు తన సొంత ఎజెండా అమలు చేశారని విమర్శించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆరు నెలలు ప్రజల అజెండా అమలు చేస్తున్నారని తెలిపారు.
2014లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని తెలిపారు. ఓట్ల కోసం అవసరాన్ని బట్టి రూపొందించిన సంక్షేమం తప్ప ప్రజలకు ఉపయోగపడే పథకాలు కావని చెప్పారు. చంద్రబాబు ప్రకటించిన తాయిలాలు చూసి ఓట్లు వేస్తే మరో ఐదేళ్లు ప్రజలు నరకయాతన పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. రెండు వేల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉందని దీనిపై చంద్రబాబు ప్రజలకు ఏం సమాధానం చెబుతావని రామచంద్రయ్య ప్రశ్నించారు.