జగన్, కేటీఆర్ భేటీ అయితే చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారని నగరి ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీఆరెస్ తో తమ పార్టీ చర్చలు జరిపిందని తెలిపారు. ఇద్దరు యంగ్ డైనమిక్ నాయకులు కలిస్తే చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నారన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ ఏ కార్యక్రమం చేసినా బురద చల్లడమే పనిగా టీడీపీ నేతలు పెట్టుకున్నారని మండిపడ్డారు. కేటీఆర్తో జగన్ మాట్లాడమే తప్పని టీడీపీ నేతలు అనడం విడ్డురంగా ఉందన్నారు. అమరావతి శంకుస్షాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ను చంద్రబాబు పిలవడమే కాకుండా రాయిమీద ఆయన పేరు చెక్కించిన విషయాన్ని రోజా గుర్తు చేశారు.
కేసీఆర్ మెప్పు కోసం చంద్రబాబు ముప్పై ఆరు రకాల వంటకాలు చేయించి దగ్గర ఉండి మరీ వడ్డించారని రోజా అన్నారు. అప్పుడు మీ బుద్ది ఏమయిందని ప్రశ్నించారు. కేసీఆర్కు దేవినేని ఉమా విజయవాడలో సన్మానం చేశారని, పరిటాల సునీత కొడుకు పెళ్లిలో కేసీఆర్ మెప్పుకోసం టీడీపీ నేతలు చేసిన ప్రదక్షిణలను అందరూ చూశారన్నారు. హైదరాబాద్లో ఉండేందుకు పదేళ్లు గడువున్నా ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని విజయవాడకు చంద్రబాబు పారిపోయి వచ్చారన్నారు. రాష్ట్రానికి మంచి జరిగే విషయంలో జగన్ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారని రోజా స్పష్టం చేశారు.