telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రేమ జంటకు .. అండగా వైసీపీ…

Marriages

ఓ యువకుడు తాను ప్రేమించిన యువతి వివాహం జరిపించాలని ఆత్మహత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించగా, విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు రంగంలోకి దిగి సర్దిచెప్పి, పెళ్లి చేయిస్తానని మాటిచ్చారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇక్కడి వళ్లియప్ప నగర్‌ కు చెందిన సంపత్‌ కుమార్‌ ఆటోడ్రైవర్‌ గా పని చేస్తూ, తవణం పల్లె మండలానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తరఫు వారు వివాహానికి అంగీకరించలేదు. దీంతో నిన్న సాయంత్రం ఆరు గంటల వేళ, నగరంలో నిత్యమూ రద్దీగా ఉండే ఓటీకే రోడ్డులోని గురునాథ థియేటర్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కాడు సంపత్ కుమార్.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు పలుమార్లు కోరినా సంపత్ కిందకు దిగలేదు. ఈ విషయం తెలుసుకున్న ఎంఎస్ బాబు, ఆ సమయంలో నగరంలోనే ఉండటంతో అక్కడికి వచ్చారు. స్పష్టమైన హామీ ఇస్తే తప్ప తాను కిందకు దిగేదిలేదని సంపత్ భీష్మించుకు కూర్చోవడంతో, తాను పెద్దలతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఫోన్ ద్వారా అదే విషయాన్ని సంపత్ కు చెప్పారు. దీంతో దాదాపు రెండున్నర గంటల ఉత్కంఠకు తెరపడగా, పట్టణ పోలీసులు, సంపత్‌ కుమార్‌పై కేసు నమోదు చేశారు.

Related posts