వైసీపీ ప్రభుత్వం వందరోజుల పాలనపై జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ విడుదల చేసిన పుస్తకం పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వందరోజుల పాలనపై విమర్శలు చేస్తున్న పవన్, చంద్రబాబు అవినీతి పాలనపై ఒక్క పుస్తకం అయినా వేశారా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పని చేస్తోందని స్పష్టం చేశారు.
అవినీతి రహిత పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు. మొన్న వరదలకు విజయవాడలోని కృష్ణలంక మునిగిపోతుంటే మంత్రులందరూ చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని బాబు, పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అక్రమ నివాసంలో ఉన్నారని పవన్ ఏరోజు అయినా ప్రశ్నించారా? అని నిలదీశారు.