కర్ణాటకలో త్వరలోనే జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప అన్నారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరులోని భావిగి భద్రేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటలో 20 నుంచి 22 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోబోతోందని తెలిపారు. ఇటీవల జరిగిన రెండు ఉపఎన్నికల తర్వాత తమ బలం మరింత పెరిగిందన్నారు.
దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ గాలి వీస్తోందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అన్నారు. 280 సీట్లు సాధించి మోదీ మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించబోతున్నారని చెప్పారు. తెలంగాణలోకూడా బీజేపీ సత్తా చాటుతుందని అన్నారు. సికింద్రాబాద్, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.