శనివారం ఉదయం ఫిలింనగర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో జరిగిన తెలుగు సినీ రచయితల సంఘం రజతోత్సవ వేడుకల టీజర్ లాంచింగ్ కోసం జరిగిన పత్రికా సమావేశంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పాల్గొన్నారు. కార్యక్రమం బలభద్రపాత్రుని రమణి స్వాగతంతో ప్రారంభమైంది. ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల, పరుచూరి వెంకటేశ్వరరావు సంఘం తొలినాటి విశేషాలను వివరించారు. అధ్యక్షుడు డా. పరుచూరి గోపాలకృష్ణ సంఘం కార్యకలాపాలు, నవంబరు 3న ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో జరగబోతున్న రచయితల సంఘం రజతోత్సవ విశేషాలని వివరించారు. అగ్ర రచయితలు దశాబ్దాల వారీగా తెలుగు సినిమా రచనల గూర్చి రచయితల గొప్పదనం గూర్చి ప్రసంగించారు. 1932 దశకం నుంచి ఈ దశకం వరకు తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం సినీ రచయితల కృషిని గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా రెబల్స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘‘రచయితలకు కాన్సన్ట్రేషన్, అంకితభావం ఉండాలి. అలా ఎంతోమంది పెద్దలున్నారు. ప్రస్తుతం కాలంతోపాటు రచనల్లో మార్పు వచ్చింది. దానికి అనుగుణంగానే రచయితలు ఉంటారు. పిల్లలకు మనం చెబితే దాన్నే ఆచరిస్తారు. అదేవిధంగా రచయితలు రాసిన మాటలే ప్రేక్షకుల్లో పాపులర్ అవుతాయి. మంచి మార్గంలో దోహదపడేలా ఉండాలి. నేను చాలా పెద్ద పెద్ద మహానుభావులతో పని చేశాను. ఆత్రేయగారు ఏదన్నా సీన్ రాసే ముందు ఆయన ఆ క్యారెక్ట్లోకి వెళ్లిపోయి డైలాగ్లు రాస్తారు. అందరూ రాస్తారు కానీ నువ్వు రాసిందికాదు ఉచ్చరించేది అనేవాడ్ని. రచయితలు మహానుభావులు వంటివారు. నేనూ రచయితల సంఘం సభ్యుడినే. మా నాన్నగారు ఓ మాట చెప్పేవారు. లక్ష్మీ ఎదురువస్తే నమస్కరించు. కానీ సరస్వతి ఎక్కడున్నా వెతికి వెతికి నమస్కరించు. అందుకే రచయితల వేడుకకు వచ్చాను. రచయితల సంఘమంటే సరస్వతీ పుత్రుల సంఘమని, అలాంటి సరస్వతీ పుత్రుల సంఘం లక్ష్మీ దేవి కటాక్షంతో అద్భుతమైన సొంత భవనం కట్టుకునేలా అభివృద్ధి చెందాలి” అని రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. నవంబర్ 3న రచయితల సంఘం రజతోత్సవ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా కర్టెన్ రైజర్గా వేడుకకు సంబంధించిన టీజర్ను కృష్ణంరాజు ఆవిష్కరించారు. .
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుపుతూ.. 1936లో ఒకేసారి ఏడుగురు రచయితలు ప్రవేశించారన్నారు. ‘ప్రేమవిజయం’ తొలిసాంఘిక చిత్రమన్నారు. కులాంతర వివాహమైన ‘మాలపిల్ల’ చాలా పెద్ద హిట్ అయిందని, ‘రైతు బిడ్డ’ అందరం గుర్తుపెట్టుకోవాల్సిన చిత్రమని తెలిపారు. అదేవిధంగా ఆ రోజుల్లో పద్యానికి దగ్గరగా పాట కూడా ఉండేదని తెలిపారు.
ఎస్.వి.రామారావు మాట్లాడుతూ… సముద్రాల రాఘవాచారి నుంచి చక్రపాణి వరకు సాగిన చరిత్రను గుర్తు చేశారు.
నాగబాలసురేష్ మాట్లాడుతూ… 1951 నుంచి 60 వరకు జరిగిన సినిమాల గురించి వాటిలో రచయితలు, దర్శకుల గురించి వివరించారు. పాతాళభైరవి, మిస్సమ్మ, ప్రపంచస్థాయిలో అవార్డులు అందుకున్న దశాబ్ధం ఇదే. గ్రాంధిక భాషలో అలవాటై నిత్యకృతి షావుకారు అనే చిత్రం వాడుక భాషలో తీసి నానుడికి శ్రీకారం చుట్టిన చిత్రమని పేర్కొన్నారు.
వడ్డేపల్లి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. 1961-70 కాలంనాటి చరిత్రను తెలియజేశారు. సినారె లాంటి గొప్ప గొప్ప కవులది కూడా ఈ దశాబ్ధమేనని తెలిపారు.
చిలుకుమార్ నటరాజ్ మాట్లాడుతూ… 1971-80 క్రమాన్ని వివరించారు. ఈ దశాబ్ధంలో స్క్రీన్ప్లేలో చాలా మార్పులు వచ్చాయి. పాతతరం, కొత్తతరం రచయితలు కలిసి ముందుకు వెళ్ళిన దశాబ్ధం ఇదేనని పేర్కొన్నారు. పరుచూరి బ్రదర్స్ లాంటివారు ఈ దశాబ్ధంలో మొదలై ఇండస్ట్రీని శాసించారని తెలిపారు.
ఉమర్జీ అనూరాధ తెలుపుతూ.. 1981-90వరకు రచయితలు, దర్శకులు నిర్మాత గురించి తెలియజేశారు. టి. కృష్ణ, ఆర్.నారాయణమూర్తి వంటివారి చిత్రాలతో పాటు పలు చిత్రాలను విశ్లేషించారు. ఇంకా రత్నబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు.