హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించిన తాజా చిత్రం కమాండో 3. సూపర్ హిట్ అయిన కమాండో సిరీస్లో మూడో భాగంగా వస్తున్న ఈ సినిమా నవంబర్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది.ఈ సినిమాను ఆదిత్య దత్ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రముఖ నటి అదా శర్మ కథానాయికగా నటించారు. అయితే ఈ సినిమాపై ప్రముఖ రెజ్లర్ సుషిల్ కుమార్ ఫైర్ అయ్యారు. సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ లో ఓ రెజ్లర్ అందరూ చూస్తుండగానే ఓ మైనర్ బాలికను ఏడిపిస్తూ ఆమె స్కర్ట్ పైకెత్తుతాడు. అంతలోపు హీరో వచ్చి వాడిని కొడతాడు. ఈ విషయంపై సుషిల్ మీడియా ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు “ఈ సన్నివేశాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రెజ్లర్లకు సమాజంలో మంచి పేరు, గౌరవం ఉన్నాయి. రెజ్లర్లను సినిమాలో తప్పుగా చూపించినందుకు కమాండో టీం మాకు సారీ చెప్పాలి. అంతేకాదు ఆ సన్నివేశాన్ని తొలగించాలి. సినిమాలో ఆ సన్నివేశం పెట్టే ముందు రెజ్లర్లపై సినిమా టీం ఎలాంటి రీసెర్చ్ చేయలేదు. మేం చాలా డీసెంట్గా, డిసిప్లైన్డ్గా ఉంటాం. ఈ విషయంపై ప్రేక్షకులు కూడా అభ్యంతరం తెలపాలని అనుకుంటున్నాను” అంటూ మండిపడ్డారు. సుషిల్ కుమార్ 2012లో లండన్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ను సాధించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన ఏకైక భారతీయుడిగా సుషిల్ తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు.