ప్రతిపక్షం రాద్ధాంతం చేసిన ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధుల ఉపసంహరణపై స్పష్టత వచ్చింది. రాజధానికి నిధులు ఇచ్చే విషయంలో వెనుకంజ వేసిన ప్రపంచ బ్యాంకు మరోవిధంగా రాష్ట్రానికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. నాలుగు కీలక రంగాల్లో రాష్ట్రానికి నిధులు ఇస్తామంటూ ప్రతిపాదించింది. వ్యవసాయం, విద్యుత్, ఆరోగ్యం, ప్రకృతి విపత్తులకు భారీగా నిధులు ఇస్తామంటూ సంసిద్ధత వ్యక్తం చేసింది. అమరావతి నిధుల విషయంలో ప్రపంచబ్యాంక్ అనూహ్యనిర్ణయం నేపథ్యంలో ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఊరట కలిగించే అంశం అని చెప్పాలి.
అయితే గత ఒప్పందం పై కూడా ప్రపంచ బ్యాంకు స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు అమరావతికి రుణ ప్రతిపాదనను ఎందుకు రద్దు చేసిన విషయాన్ని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం సూచనతోనే అమరావతికి ఆర్థికసాయాన్ని ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. రాజధాని మౌలిక వసతుల అభివృద్ధికి రుణం ఇవ్వాలని ప్రపంచ బ్యాంకుకు ఏపీలోని గత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుని కేంద్రానికి ఈ నెల 15న లేఖ రాసినట్టు చెప్పారు.