టెక్ ఎంతగా అభివృద్ధి చెందుతుంతో, దానిని ఇలా కూడా ఉపయోగించవచ్చా అనేంతగా ఆశ్చర్యపరిచే విధంగా దానిని ప్రత్యేకంగా వాడుకునే వాళ్ళు కూడా తరచూ కనిపిస్తుంటారు. దాదాపు అలాంటి ఘటనే .. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో చోటుచేసుకుంది. భర్త వదిలేశాడు, పిల్లల ఆలనాపాలనా చూసుకోవాలి, డబ్బు సాయం చేయండి అంటూ ఆన్ లైన్ లో భిక్షాటన చేస్తుంది.. ఓ యువతి. తీరా ఆమె మోసగత్తె అని కాస్త ఆలస్యంగానైనా వెల్లడైంది. అప్పటికే ఆమె మాయమాటలకు ఎంతోమంది మోసపోయారు.
ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఇలా అన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అకౌంట్ తెరిచి తన వంచక పర్వాన్ని కొనసాగించింది. ఆ విధంగా 17 రోజుల్లో 50,000 డాలర్లు రాబట్టిందా కిలాడీ. ప్రస్తుతం ఆమె కటకటాల వెనక్కి చేరింది. ఆమె పోస్టుల్లో ఉన్న చిన్న పిల్లలను గుర్తుపట్టిన బంధువులు భర్తకు విషయం చెప్పడంతో ఆ మాయలేడి గుట్టురట్టయింది. అతగాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్ట్ చేశారు. భర్త వదిలేసిన విషయం వాస్తవమే అయినా, పిల్లలను ఆమె భర్తే చూసుకుంటున్నాడన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. దానితో ఆ మహిళ ఆన్ లైన్ లో అందరినీ మోసం చేస్తోందని గుర్తించారు.