కోపోద్రిక్తురాలైన ఓ తల్లి తమ ఇద్దరు కొడుకులను హతమార్చింది. దీంతో మహాశివరాత్రి పండుగ రోజు వారి ఇంట్లో విషాదం నెలకొన్నది. స్థానికుల కథనం ప్రకారం.. బద్రి శ్రీకాంత్, రమాదేవి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరికాలనీలో గత కొంత కాలంగా నివాసముంటున్నారు. శ్రీకాంత్ ద్వారకానగర్లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పనిచేస్తుండగా.. రమాదేవి గతంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేసి మానేసింది. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటున్నది. వీరికి అజయ్ (10), ఆర్యన్ (6) అనే ఇద్దరు కుమారులున్నారు. అజయ్ నాలుగో తరగతి, ఆర్యన్ ఓ ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నారు.
సోమవారం ఉదయం అజయ్, ఆర్యన్ గొడవపడ్డారు. దీంతో రమాదేవి వారిని చితకబాదింది. అనంతరం పిల్లలిద్దరూ రోదిస్తూ తండ్రితో మాట్లాడుతామంటూ ఫోన్ తీసుకొచ్చారు. కోపోద్రిక్తురాలైన రమాదేవి ఇటుక పెల్లతో వారిపై ఒక్కసారిగా దాడి చేయడంతో ఇద్దరికీ తలపై తీవ్ర గాయాలయ్యాయి.అనంతరం ఆందోళనకు గురైన రమాదేవి గేట్కు తాళంవేసి ఇంట్లోకి వెళ్లి గ్యాస్ లీక్ చేసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. పాఠశాలకు రాత్రి విధులకు వెళ్లిన శ్రీకాంత్ ఇంటికి వచ్చి చిన్నారులను గోదావరిఖనిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా అజయ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం చిన్న కొడుకు ఆర్యన్ ను కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.