శ్రీలంకలో గత ఆదివారం ఈస్టర్ వేడుకల సందర్భంగా రాజధాని నగరం కొలంబోతో పాటు దేశంలోని పలు ప్రదేశాల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే . ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 321కి పెరిగింది. బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు ఆ దేశ రక్షణశాఖ సహాయమంత్రి రువాన్ విజయవర్దనే తెలిపారు. ఆరోగ్య మంత్రి రజిత సేనరత్నే మాట్లాడుతూ స్థానిక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్ ఈ దాడులకు కుట్రపన్నినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఆత్మాహుతి దాడులకు పాల్పడిన వారందరూ శ్రీలంక జాతీయులేననీ, వారికి ఐసిస్ లేదా ఏదేనీ ఇతర విదేశీ ఉగ్రవాద సంస్థ మద్దతు ఇచ్చి ఉండొచ్చన్నారు.