దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మద్యం షాపులు మూసివుండడంతో తాగుడుకు అలవాటు పడినవారు అనారోగ్య బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ క్రమంలో వెంటనే మద్యం అమ్మకాలను అనుమతిస్తూ, మూతబడివున్న వైన్ షాపులను తెరిపించాలని తెలంగాణ సహా 10 రాష్ట్ర ముఖ్యమంత్రులకు సీఐఏబీసీ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్) ఓ లేఖను రాసింది. లాక్ డౌన్ నిబంధనల మేరకు మద్యం షాపులను మూసివేసినా, ఎన్నో ప్రాంతాల్లో అక్రమ అమ్మకాలు ఆగలేదని గుర్తు చేసిన సీఐఏబీసీ, షాపుల మూసివేతతో మందుకు అలవాటుపడ్డ వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడింది.
మద్యం ప్రభావం భవిష్యత్తులో శాంతి భద్రతలపైనా పడవచ్చని సీఐఏబీసీ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. నిర్ణీత పని వేళలను, సామాజిక దూరాన్ని పాటిస్తూ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని మద్యం షాపులను తెరిపించాలని ఆయన కోరారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మద్యం అమ్మకాల విషయంలో సడలింపులు ఇచ్చాయని గుర్తు చేశారు.
లోకేశ్ నేరుగా మాట్లాడలేరు… ట్విట్టర్లో ఏదో ఒకటి చెబుతారు: బొత్స