వాట్సాప్ యాజమాన్యం యాప్ యూజర్లంతా వెంటనే అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు విజ్ఞప్తి చేసింది. వాయిస్ కాల్ ఫీచర్ ద్వారా ఫోన్లలో వైరస్ అటాక్ అవుతోందని ఆ సంస్థ గుర్తించింది. వాట్సాప్లో కాల్ లిఫ్ట్ అటెండ్ చేసినా, చేయకున్నా, లేదంటే మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా వైరస్ అటాక్ అవుతుందని తెలిపింది. ఈ వైరస్ అటాక్ అయ్యిందంటే వ్యక్తిగత సమాచారంతో పాటు రహస్య సమాచారమంతటినీ దొంగిలిస్తారని తెలుసుకున్న వాట్సాప్ యాజమాన్యం ఖాతాదారులను అలర్ట్ చేసింది.
ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ డెవలప్ చేసిన స్పైవేర్ .. వాట్సాప్ వాయిస్ కాల్స్ అదనపు భద్రతకు సంబంధించి ఫీచర్లను జత చేస్తుండగా ఫోన్లలో ప్రవేశించిందని వాట్సాప్ యాజమాన్యం వెల్లడించింది. ఈ స్పైవేర్ అటాక్ అయినట్టు మే నెల మొదటి వారంలో గుర్తించామని వెంటనే తమ టీం ఆ సమస్యను పరిష్కరించిందని తెలిపారు. కాబట్టి వెంటనే వాట్సాప్ యాప్ను అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ ప్రతినిధి ఒకరు సూచించారు.