నిబంధనలను అతిక్రమిస్తే అకౌంట్లు బ్యాన్ చేస్తానమని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ హెచ్చరించింది. భారతదేశంలోని రాజకీయ పార్టీలు తమ సేవలను దుర్వినియోగం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేసింది. వాట్సాప్ కమ్యూనికేషన్స్ హెడ్ కార్ల్ వూగ్ మాట్లాడుతూ.. వాట్సాప్ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు తమ సేవలను వాడుకుంటున్నట్టు తాము గుర్తించామని తెలిపారు.
తమ ప్రత్యర్థి పార్టీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, వీడియోలను అన్ని రాజకీయ పార్టీలు వాట్సాప్ ద్వారా వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై ఇదే విధంగా వ్యవహరిస్తే వాటిపై నిషేధం విధిస్తామని హెచ్చరించారు. భారీ ఎత్తులో సందేశాలను పంపడం తమ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.
తాము సదుద్దేశంతో నిర్వహిస్తున్న వాట్సాప్ సేవలను దుర్వినియోగం చేయవద్దని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిఘా ఉంటుందని వెల్లడించారు. అభ్యంతరకర సమాచారాన్ని గుర్తించి వెంటనే తొలగించేందుకు కృషి చేస్తామని వివరించారు. ఆటోమేటెడ్ రోబోటిక్స్ ద్వారా పెద్ద ఎత్తున సందేశాలను పంపడం చేయరాదని సూచించారు.