ఎల్లప్పుడు సంచలనాలకు కేంద్రబిందువులా ఉండే రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు. ఆయన తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పలు వివాదాల నడుమ రిలీజ్కి సిద్ధమవుతుంది. ఒకవైపు తెలుగు తమ్ముళ్ళు సినిమాని రిలీజ్ని అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండగా, వర్మ మాత్రం ఎలా అయిన విడుదల చేస్తానంటూ శపథం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మార్చి 20న సెన్సార్ నుండి చిత్రానికి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సెన్సార్ బోర్డ్ సభ్యులు కొన్ని సీన్స్ తీసేయాలని పట్టుబడితే వర్మ తీస్తాడా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఒకవైపు సినిమా రిలీజ్ విషయంలో సస్పెన్స్ ఉన్నప్పటికి వర్మ తన సినిమా ప్రమోషన్ని మాత్రం ఆపడం లేదు. తాజాగా నందమూరి తారకరామారావు గారి పాపులర్ ఫొటోని మార్ఫింగ్ చేసి అన్నగారి ఫేస్కి బదులుగా వర్మ ఫొటో పెట్టేసుకున్నాడు. ‘ఎన్టీఆర్ లుక్ ఒకర్ని పోలినట్టు ఉంది.. అతనెవరో మీకు తెలుసా?’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మరి ఇది వర్మ ఓన్ క్రియేటివిటీనా, లేదంటా ఎవరైన ఫ్యాన్స్ ఇలా పంపించారా అనేది తెలియాల్సి ఉంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఈ నెలలోనే రిలీజ్ చేయాలని వర్మ భావిస్తుండగా, ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేయమని సెన్సార్ సభ్యులు సలహాలు ఇస్తున్నట్టు టాక్.