పశ్చిమబెంగాల్లో ఉపఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవలే భవానీపూర్ నియోజకవర్గానికి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జి నామినేషన్ దాఖలు చేశారు. బెంగాల్లోని భవానీపూర్ సహా షంషేర్గంజ్, జాంగీర్పూర్ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి.
కాగా, దీదీపై ప్రముఖ న్యాయవాది ప్రియాంకా టిబ్రివాల్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలుకాగా.. మమతాబెనర్జి ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక తిబ్రివాల్ సోమవారం నామినేషన్ వేశారు. కోల్కతాలోని సర్వే బిల్డింగ్కు బంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారితో కలిసి చేరుకున్న ప్రియాంక.. నామపత్రాల సమర్పణ ప్రక్రియ పూర్తిచేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తొలి అడుగుగా నామినేషన్ వేశానంటూ ప్రియాంక తెలిపారు.
ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీచేసిన బంగాల్ ముఖ్యమంత్రి మమత అప్పుడు ఓడిపోయారు. అయినా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన దీదీ.. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భవానీపుర్ నుంచి ఎన్నికైన సోబన్దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేయగా.. ఉపఎన్నిక నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం.
ఈ క్రమంలో దీదీపై ఎవరు పోటీకి దిగుతారన్న అంశంపై స్పష్టతనిచ్చిన బీజేపీ.. న్యాయవాది ప్రియాంక తిబ్రీవాల్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. భవానీపుర్లో ఉపఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరుగనుంది. ఫలితాలు అక్టోబర్ 3న వెల్లడించనున్నారు.