పాక్ ప్రధాని ఇమ్రాన్ కాశ్మీర్ విషయమై భారత్ తో అణుయుద్ధానిౖకైనా సిద్ధమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, కాశ్మీర్ పరిస్థితి యుద్ధానికి దారి తీసిన పక్షంలో, రెండు దేశాల వద్దా అణ్వాయుధాలు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. కాశ్మీర్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, అంతర్జాతీయ సమాజం ఇప్పుడు బాధ్యత తీసుకోకుంటే, తాము చేయగలిగింది చేయడం మినహా మరో మార్గం తమ ముందు లేదని అన్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగే ప్రతి సమావేశంలోనూ కాశ్మీర్ అంశాన్ని తాము లేవనెత్తుతామని, ఇండియాతో చర్చలు జరిపేందుకు తాము ప్రయత్నించినా, స్పందన రాలేదని అన్నారు.
ఇండియా ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వంతో చర్చలు జరపవచ్చని అనుకున్నానని, కానీ, మోదీ ప్రభుత్వం రెండోసారి రాగానే, ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా చారిత్రక తప్పిదాన్ని చేసిందని అన్నారు. సొంత రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. వచ్చే నెలలో జరిగే ఐరాస సాధారణ సమావేశాల్లో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తామని, ఆర్థిక సంబంధాల వల్లే ఇతర ముస్లిం దేశాలు పాక్ కు మద్దతుగా నిలవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో వారంతా కలిసి వస్తారనే భావిస్తున్నానని అన్నారు.