టీ20 బ్యాట్స్మన్ కన్నా టెస్టు బ్యాట్స్మన్గానే తాను అత్యుత్తమంగా రాణిస్తానని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ అన్నట్లు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. పాకిస్థాన్తో జరుగుతున్న రెండో టెస్టు (డేనైట్) సందర్భంగా శనివారం ట్రిపుల్ సెంచరీ చేసిన అతడు మ్యాచ్ అనంతరం విలేకర్లతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తాను ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు సెహ్వాగ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. ‘నేను దిల్లీ డేర్డెవిల్స్ తరఫున ఆడుతున్నప్పుడు సెహ్వాగ్ నాతో కూర్చొని ఒకసారి ముచ్చటించాడు. టీ20ల్లో కన్నా టెస్టుల్లోనే అత్యుత్తమ బ్యాట్స్మన్గానే రాణిస్తానని అన్నాడు. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారని.. నేను ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఎక్కువగా ఆడలేదని అతడికి చెప్పాను’ అని పేర్కొన్నాడు.
టెస్టుల్లో స్లిప్, గల్లీలో ఫీల్డర్లు ఉంటారు. మిడ్ వికెట్లోనూ ఉంటారు. మిడ్ ఆఫ్, మిడ్ ఆన్లో కూడా ఉంటారు. వాళ్ల పై నుంచి ఆడుతూ రోజంతా బ్యాటింగ్ చేయోచ్చని సెహ్వాగ్ నాతో అన్నాడు. ఈ విషయం వినడానికి చాలా తేలిగ్గా అనిపించిందని, తన మెదడులో ఈ విషయం కూరుకుపోయిందని వార్నర్ చెప్పుకొచ్చాడు. ఇటీవల యాషెస్లో ఘోరంగా విఫలమైన వార్నర్ 5 మ్యాచ్ల్లో మొత్తం 95 పరుగులే చేశాడు. తాజాగా పాకిస్థాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో చెలరేగుతున్నాడు. తొలి టెస్టులో 154 పరుగులు చేసిన ఆసీస్ ఓపెనర్ రెండో టెస్టులో (335 నాటౌట్) తన సత్తా చాటాడు. దీంతో టెస్టుల్లో డాన్బ్రాడ్మన్(334) రికార్డును అధిగమించాడు.