రోజు ఆయా పనులు చేసుకోడానికి శరీరానికి తగిన శక్తి అవసరం. దానిని ఆహారం ద్వారా మాత్రమే అందించాలి అనుకుంటున్నాం.. కానీ నీరు, సూర్యకాంతి, పచ్చదనం.. లాంటివి కూడా శరీరానికి కావాల్సిన వాటిలో ముఖ్యమైనవే. ఇవి ఆహారంగా తీసుకోలేనివైనా, వాటి ప్రభావంతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే శక్తి వాటిలో ఉంది. ముఖ్యంగా విటమిన్ డి, దీనితో అనేక ఉపయోగాలు వయోపరిమితం లేకుండా ఉన్నాయి. అందుకే రోజు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో కాసేపు ఎండలో ఉండమంటారు. తద్వారా అందరికి డి విటమిన్ లభించి, ఎముకలు దృడంగా ఉండటమే కాకుండా చర్మం నూతన శక్తిని పొందుతుంది.
ఈ విటమిన్ లోపిస్తే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకని విటమిన్ డి ఉన్న ఆహారాలను మనం నిత్యం తీసుకోవాల్సిందే. విటమిన్ డి మన శరీరం కాల్షియంను శోషించుకునేందుకు ఉపయోగపడుతుంది. దీనితో పాటు ఎముకలను దృఢంగా ఉంచుతుంది. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనమై పెలుసుబారిపోతాయి. అలాగే కీళ్లు, కండరాల నొప్పులు వస్తాయి. నిత్యం ఉదయాన్నే కొంత సమయం పాటు ఎండలో నిలుచుంటే చాలు మనకు విటమిన్ డి అందుతుంది. దీని వల్ల శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పలు వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. విటమిన్ డి చర్మానికి, వెంట్రుకల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు నిత్యం విటమిన్ డి ఉన్న ఆహారాలను తీసుకోవాలి.
విటమిన్ డి ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణసమస్యలు పోతాయి. క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. అందుకని విటమిన్ డి ఉన్న ఆహారాలను రోజూ ఖచ్చితంగా తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతున్నారు. మనకు విటమిన్ డి చేపలు, చీజ్, కోడిగుడ్డ పచ్చ సొన, పాలు, నట్స్, సీడ్స్, సోయా ప్రొడక్ట్స్లలో పుష్కలంగా లభిస్తుంది. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవచ్చు. అలాగే పలు అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.