“ఫలక్నుమాదాస్” చిత్రంపై కొందరు కావాలనే నెగటివ్ ప్రచారం చేస్తున్నారని ఆ సినిమా హీరో, దర్శకుడు విశ్వక్సేన్ సోషల్ మీడియాలో స్పందించిన తీరు వివాదానికి దారి తీసింది. విశ్వక్సేన్, విజయ్దేవరకొండ ఫ్యాన్స్ మధ్య గొడవలంటూ వార్తలు వచ్చాయి. దీనిపై విశ్వక్సేన్ స్పందిస్తూ హైదరాబాద్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. “నాకున్న స్థితికి నేను ఎలాంటి టెన్షన్ లేకుండా సినిమాలు చేసుకోవచ్చు. అలాగే ఐదు కోట్లు ఖర్చు పెట్టి నార్మల్ కమర్షియల్ సినిమాలు చేసుకోవచ్చు. చాలా మంది ఫిలిం మేకర్స్కు నా సినిమా ఒక లాంచింగ్ ప్యాడ్లా ఉండాలని 80 మంది కొత్తవాళ్లను పెట్టి సినిమా చేశాను. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం. అయితే మా సినిమాపై నెగిటివీని ప్రచారం చేయడానికి ఓగ్రూప్ తయారైంది. ఎంతో ఖర్చు పెట్టి వేసిన పోస్టర్స్ను కొందరు చించేశారు. అది చూసి చాలా బాధేసింది.
నేను డబ్బులెక్కువై సినిమాలు చేయలేదు. ఎవడినీ ముంచి సినిమాలు చేయలేదు. అలాగే ఎవరినో ఏదో అనేసి పబ్లిసిటీ తెచ్చుకుందామనే చీప్ మెంటాలిటీ నాకు లేదు. అలాగైతే ఇంత పెద్ద సినిమాను నేను డైరెక్ట్ చేయలేను. ఏదో చీప్ ట్రిక్స్ చేసుకుంటుండేవాడిని. నేను ఆడియెన్స్ను తిట్టానని అంటున్నారు. నేను ఎందుకు తిడతాను?..అంత తెలివి లేకుండా ఉన్నానా? ఈ వారంలో విడుదలైన సినిమాలన్నింటిలో నా సినిమాకే హయ్యస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే నా సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లో కస్ వర్డ్ వాడినందుకు సారీ. నేను ఎవరికీ సవాల్ విసరలేదు. ఎవరి ఫ్యాన్స్ను ఏమీ అనలేదు. నాకు అన్నం పెట్టేదే సినిమా. అలాంటిది రివ్యూ రైటర్స్ను నేను ఎందుకు విమర్శిస్తాను. నిజంగా నేను వాళ్లని అన్నట్లు నిరూపిస్తే ఇండస్ట్రీ నుండి వెళ్లిపోతాను” అన్నారు.