telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ తప్పులు పెరిగిపోతున్నాయి: విజయశాంతి

vijayashanthi

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కరోనా విజృంభించడంతో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంలో సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. శిశుపాలుడి తప్పుల్లా తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పులు నానాటికీ పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు.

ప్రజాతీర్పు తనకే అనుకూలం అని విర్రవీగుతున్న దొరగారికి ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కొనే రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు. ప్రతి విషయంలో మాయ మాటలు చెబుతూ, ఉచిత సలహాలు ఇస్తూ తనను మేధావిగా చెప్పుకునే కేసీఆర్ ఇప్పుడు కరోనా మహమ్మారిని కట్టడి చేయడం చేతకాక చేతులెత్తేశారని దుయ్యబట్టారు. సీఎం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని వివరించారు.

కరోనా పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని హైకోర్టు తప్పుబట్టినా సీఎం దొర ఏమాత్రం పట్టించుకోలేదు. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించి గవర్నర్ తమిళిసై స్వయంగా జోక్యం చేసుకుని సంక్షోభ నివారణకు చొరవ ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ తన బాధ్యతల నిర్వహణలో విఫలం కావడంతో గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని విజయశాంతి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Related posts