కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి గ్రేటర్ ఎన్నికలపై స్పందించారు. అంతే కాదు… వరద సాయం పేరుతో సీఎం కేసీఆర్ ఓట రాజకీయానికి పాల్పడుతున్నట్టు మండిపడ్డారు విజయశాంతి. ” గ్రేటర్ హైదరాబాదులో భారీ వర్షాల వల్ల బాధితులైన ముంపు ప్రాంతాల ప్రజలకు వరద సాయం పేరిట కేసీఆర్ దొరగారి సర్కారు ఓట్ల రాజకీయానికి పాల్పడిందనడం కాదనలేని సత్యం. భారీ వర్షాలు కురిసి దాదాపు 3 వారాలు దాటుతున్నా తెలంగాణ సర్కారు ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించలేకపోయింది. ఇచ్చిన పరిహారం కూడా అపహాస్యం పాలైంది. టీఆర్ఎస్ నేతలు సూచించినవారికి మాత్రమే… అదీ చాలావరకూ అరకొరగా ఇచ్చి, నిజమైన బాధితులను విస్మరించి విమర్శలపాలయ్యారు. ఇప్పుడు బల్దియా ఎన్నికలు కేవలం 2 వారాలే ఉన్న నేపథ్యంలో పరిహారం అందని వరద బాధితుల్ని మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోమని చెప్పి, వారిని ఊపిరాడకుండా చేసి ఒక మహిళ మృతికి కూడా కారణమయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే… ఈ చర్య గ్రేటర్ ఎన్నికల కోసం ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నమే. టీఆర్ఎస్ కుట్రను ఎన్నికల సంఘం గుర్తించి, ఎన్నికలయ్యే వరకూ వరద సాయం ఆపమని ఆదేశిస్తే…. ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చెయ్యడం వల్లే సాయం ఆపామనడం “అడలేక మద్దెల ఓడు” అన్నట్టుంది. ఈ పరిస్థితులను చూస్తుంటే… ఇదంతా ప్రభుత్వం చేతగానితనం కంటే… గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఉద్దేశ్యపూర్వకంగానే వరదసాయాన్ని జాప్యం చేసినట్లు స్పష్టమవుతోంది. ఓటర్లు కేసీఆర్ దొరగారి కుట్రను అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్ళు కాదు.” అంటూ మండిపడ్డారు విజయశాంతి. కాగా… విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీకి వెళతారని జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.
previous post
తమ కేబినెట్లో మంత్రులు హీరోలు: జగన్