తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతోన్న డేటా చోరీ కేసు విచారణ కోసం సిట్ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా సిట్ ద్వారా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని చెప్పడం పై ఆమె మండిపడ్డారు. పొరుగు రాష్ట్రంలో జరిగే అన్యాయానికైతే సిట్ వేస్తారా అని ప్రశ్నించారు.
అదే తెలంగాణలో జరిగితే సిట్ అంటూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా అంటూ ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణలు డేటా చోరీ వ్యవహారంపై గవనర్నర్ నరసింహన్ ను కలిసన వెంటనే సిట్ ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు.కేసీఆర్ కోరుకుంటున్న ఫెడరల్ వ్యవస్ధ అంటే ఇలాగే ఉంటుందేమోనని విజయశాంతి ఎద్దేవా చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రతిపక్షాలు అరిచి గీపెట్టినా, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విజయశాంతి గుర్తు చేశారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సిట్ ద్వారా విచారణకు ఆదేశించడం వింతగా ఉందన్నారు. ఐటీ గ్రిడ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేసి, ఓటర్ల జాబితాను తారుమారు చేస్తారన్న ఆరోపణపై తెలంగాణ పోలీసులు కేసులు పెడుతున్నారంటూ విజయశాంతి ఆరోపించారు.