వైసీపీ నేత, విజయసాయిరెడ్డి సామజిక మాధ్యమాలలో చురుగ్గానే ఉంటారు. తాజాగా ఆయన వైసీపీ విజయంపై మాట్లాడుతూ, కులం, అవినీతితో పెచ్చరిల్లిన టీడీపీని కూకటివేళ్లతో పెకలించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మనంపై చర్చ సందర్భంగా విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఈరోజు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ను అవినీతిరహిత రాష్ట్రంగా చేయాలని సీఎం జగన్ తపన పడుతున్నారని చెప్పారు. తద్వారా ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన నీతిఆయోగ్ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ కోరిన విషయాన్ని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏపీ విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవావాలని డిమాండ్ చేశారు. నాడు విభజన ప్రక్రియలో ఉన్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఇప్పుడు ఏపీకి న్యాయం చేసేందుకు సహకరించాలని కోరారు. పోలవరాన్ని సవరించిన అంచనాలతో నిర్ణీత గడువులోగా నిర్మించాలని చెప్పారు. వీటితో పాటు కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడ పెట్రో కారిడార్ ను కేంద్రం పూర్తిచేయాలని విజయసాయిరెడ్డి కోరారు.