తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో ప్రభుత్వం యురేనియం తవ్వకాలు చేపట్టాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. నల్లమలలో యురేనియం నిల్వలు ఉన్నాయి. ఈ నిర్ణయంపై రాజకీయంగా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వంటి ప్రముఖులు ఇప్పటికే ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ట్విటర్ ద్వారా స్పందించాడు. “యురేనియం తవ్వకాల వల్ల నల్లమలలోని 20 వేల ఎకరాల అటవీ భూమి ధ్వంసం కానుంది. మనం ఇప్పటికే సరస్సులను నాశనం చేశాం. ప్రకృతి వనురులను నాశనం చేసుకున్నాం. దీంతో కొన్నిచోట్ల వరదలు, కొన్నిచోట్ల కరువును చూస్తున్నాం. తాగునీరు కలుషితం అవుతోంది. గాలి కలుషితం అవుతోంది. కొన్ని నగరాల్లో నివసిస్తున్న ప్రజలు నీటి కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. అయినా మనం మారడం లేదు. మిగిలి ఉన్న కొన్ని వనరులను కూడా నాశనం చేసుకుంటున్నాం. ప్రస్తుతం నల్లమలను నాశనం చేసే పనిలో పడ్డాం. మీకు యురేనియం కావాలంటే కొనుక్కోండి. యురేనియం కొనవచ్చు.. అడవులను కొనగలమా? పీల్చడానికి గాలి, తాగడానికి నీరు లేనపుడు యురేనియం, విద్యుత్తును ఏమి చేసుకుంటాము” అని విజయ్ ప్రశ్నించాడు.
previous post