రాజకీయ నేతల భాష అభ్యంతరకరంగా తయారైందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరు క్లబ్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు తలచుకుంటే గత రాజకీయాల పట్ల సంతోషంగా ఉందని అన్నారు. నేటి చట్టసభలు నడుస్తున్న తీరు బాధాకరమని అన్నారు.
ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ఇంతగా దిగజారిపోయాయా అనిపిస్తుంది. ఇలాంటి రాజకీయాలపై ప్రజలు, పత్రికలు సమీక్షలు చేయాలి. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కులం, మతం, ధనం ప్రధానం కాదు. పార్టీలు విచ్చలవిడిగా ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయని అన్నారు. ప్రజలు ఇచ్చిన డబ్బుతోనే తాను ఎన్నికల్లో పోటీ చేసేవాడినని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 42ఏండ్ల తర్వాత తొలిసారిగా తాను లేకుండా ఎన్నికలు జరిగాయని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.