గత రాత్రి ప్రముఖ సంగీత దర్శకులు రాజన్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని తన నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పలు భాషల్లో కలిపి 200 లకు పైగా సినిమాలకు సంగీతం అందించిన అనుభవం ఆయన సొంతం. రాజన్ మరణవార్త తెలిసి పలువురు సౌత్ ఇండియన్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు రాజన్. తన తమ్ముడు నాగేంద్రతో కలిసి సంగీత దర్శకుడిగా ఆయన స్వరాలు అందించారు. రాజన్-నాగేంద్ర ద్వయంగా వారిద్దరూ సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రసిద్ధి చెందారు. 1952లో విడుదలైన ‘సౌభాగ్య లక్ష్మి’ సినిమాతో సంగీత దర్శకులుగా రాజన్ కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత పలు సినిమాలకు బాణీలు కట్టి దాదాపు 37 సంవత్సరాల పాటు ఆయన సంగీత సేవలు అందించారు. తెలుగులో సొమ్మొకడిది సోకొకడిది, రెండు రెళ్లు ఆరు, కిలాడీ దొంగలు, నాగమల్లి, అగ్గి పిడుగు, పంతులమ్మ, మూడుముళ్లు, పూజ, ప్రేమ ఖైదీ, పులి బెబ్బులి తదితర సినిమాలకు తన సోదరుడు నాగేంద్రతో కలసి సంగీతం సమకూర్చారు రాజన్.
next post