telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నటుడు విజయ్ చందర్ కు కీలక పదవి

Vijay-Chandar

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా సీనియర్ నటుడు టి. విజయ్ చందర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ పేర్కొంది. నటుడు విజయ్ చందర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. రంగస్థల నటుడు అయిన విజయ్ చందర్.. 1967లో ‘సుడిగుండాలు’ సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఈ సినిమా ఉత్తమ చిత్రం విభాగంలో జాతీయ అవార్డును అందుకుంది. ఆ తరవాత ‘కరుణామయుడు’, ‘శ్రీ షిర్డీ సాయిబాబా’, ‘గీతాంజలి’, ‘ఆపద్బాంధువుడు’, ‘భద్రాచలం’ వంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించి పాపులర్ అయ్యారు. ముఖ్యంగా షిర్డీ సాయిబాబాగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో విజయ్ చందర్ చెరగని ముద్ర వేశారు. ఆయన చివరిగా నటించిన చిత్రం ‘118’. ఇదిలా ఉంటే… వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి విజయ్ చందర్ ఆయన వెంటే ఉన్నారు. జగన్‌కు తన సంపూర్ణ మద్దతును తెలిపారు. ఆయనతో పాదయాత్రలో పాల్గొన్నారు. అందుకే తనకెంతో మద్దతుగా నిలిచిన విజయ్ చందర్‌కు ఈ పదవిని అప్పగించారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు రాష్ట్ర అధికార భాషా సంఘానికి కూడా సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మోదుగుల పాపిరెడ్డి, ఆచార్య షేక్ మస్తాన్, ఆచార్య చందూ సుబ్బారావు, ఆచార్య శరత్ జ్యోత్స్నా రాణిలను సభ్యులుగా నియమిస్తూ భాషా సాంస్కృతిక శాఖ ఆదేశాలిచ్చింది.

Related posts