ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి రిలీజ్ డేట్ ప్రకటించిన దర్శకుడు వర్మ మరోసారి విజయవాడలోని పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెడతానంటూ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో, విజయవాడ పోలీసులు రద్దీగా ఉండే రోడ్డులో ప్రెస్ మీట్ పెడితే అత్యవసర సర్వీసులకు విఘాతం కలిగే అవకాశం ఉందని తెలిపారు.
హాల్ లో కానీ, ఏదైనా ప్రెస్ క్లబ్ లో కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విజయవాడలో ప్రస్తుతం సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్నాయని, దానికితోడు ఎన్నికల కోడ్ ఇంకా ముగియలేదని వర్మకు వివరించారు. పైపుల రోడ్డులో ఉన్న కొన్ని కాలేజీలు, స్కూళ్లలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశంలో కార్యక్రమాలకు తాము అనుమతించలేమని తెలిపారు.
వర్మ తన ప్రెస్ మీట్ పై మరోసారి ఆలోచించుకోవాలని విజయవాడ నార్త్ ఏసీపీ రమేశ్ స్పష్టం చేశారు. వర్మ కూడా తన ప్రెస్ మీట్ పై వెనక్కితగ్గినట్టు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గాంధీ నగర్ లోని ఫిలిం చాంబర్ లో మీడియా సమావేశం ఉంటుందని ట్వీట్ చేశారు. ఎండల తీవ్రత, కొన్ని ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఏపీలో అరాచక పాలన..కేంద్రం దృష్టిసారించాలి: యనమల