గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయనను బుజ్జగించేందుకు ఆ పార్టీ నేతలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ రంగంలోకి దిగారు. నిన్న రాత్రి దాదాపు మూడున్నర గంటలపాటు కేశినేని నివాసంలో వల్లభనేనితో చర్చించారు. అర్ధరాత్రి వరకు ఈ చర్చలు కొనసాగాయి.ఈ సందర్భంగా వల్లభనేని మాట్లాడుతూ.. తనపైనా, తన అనుచరులపైనా నమోదవుతున్న అక్రమ కేసుల విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. తాను ఇప్పటికే ఓ నిర్ణయం తీసేసుకున్నాను కాబట్టి ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వారికి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా టీడీపీలో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పార్టీలో ఉన్న ఇబ్బందుల విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారి భరోసా విన్న వల్లభనేని తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు చెప్పారు. వల్లభనేనితో చర్చల వివరాలను కొనకళ్ల, కేశినేని నానిలు చంద్రబాబుకు వివరించారు.