హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా “వాల్మీకి” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన “జిగర్తాండ” సినిమాకు ఇది రీమేక్. ఆ సినిమాలో బాబీసింహా పోషించిన పాత్రను వరుణ్ తేజ్, సిద్ధార్థ్ పోషించిన పాత్రను అధర్వ మురళి చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. “వాల్మీకి” చిత్రాన్ని ఆచంట రాము, గోపినాథ్ లు 14రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్ర షూటింగ్ తాజాగా ప్రముఖ శివ క్షేత్రం యాగంటిలో జరుపుకుంటుంది.
ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. షూటింగ్ లొకేషన్కి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. “శివుని ఆశీస్సులతో ఈ అద్భుతమైన ప్రదేశంలో షూటింగ్ మొదలుపెట్టాం” అని సందేశం ద్వారా తెలిపారు. ఈ షెడ్యూల్లో వరుణ్ తేజ్తో పాటు బ్రహ్మాజీ, పూజా హెగ్డే పాల్గొంటారని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ కోసమే వరుణ్ నిన్న హైదరాబాద్ నుండి బయలు దేరగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రాయినిపేట వద్ద ప్రమాదం జరిగింది. ఇండికా కారు వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న ఆడికారుని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలతోనే వరుణ్ పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు.