కేంద్ర మాజీమంత్రి కాంగ్రెస్ పార్టీ కీలక నేత వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిలెక్కనున్నారు. అమరావతిలో నేడు పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆయన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అరకు పార్లమెంట్ లో మంచి పట్టున్న నేత కావడంతో ఆయనను అరకు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు.
ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ అభ్యర్థిగా కిషోర్ చంద్రదేవ్ తనయ శృతీదేవి పోటీ చేయనున్నారు. తండ్రిపై పోటీకి కుమార్తె సై అనడంతో ఉత్తరాంధ్ర రాజకీయాలు హీటెక్కాయి. అటు ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ వైసీపీ నేత చలమల శెట్టి సునీల్ సైతం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మార్చి మెుదటి వారంలో చలమల శెట్టి సునీల్ సైకిల్ ఎక్కనున్నారు.
అలాగే మార్చి 6న కర్నూలు జిల్లా పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇకపోతే ఈనెల 28న కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరనుంది. ఇలా వరుసగా టీడీపీలోకి వలసలు రావడంతో ఆ పార్టీ మాంచి జోష్ లో ఉంది.