టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలే అజెండాగా హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కేసీఆర్కు బుద్ధి చెబుదామని కాంగ్రెస్ నేతలకు ఉత్తమ్ పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీపై ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి చోటు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఫిరాయింపులపై ఆయన స్పందిస్తూ నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేసి పార్టీ మారాలని సవాలు విసిరారు.