అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటనపై అమెరికా సెనేటర్ బెర్నీ శాండర్స్ మండిపడ్డారు. కోట్లాది డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు ఇండియా వెళ్లారా? అని నిలదీశారు. దానికి బదులు వాతావరణ మార్పులపై పోరాటం, కాలుష్యాన్ని తగ్గించడం, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై ఒప్పందాలు చేసుకుంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.
బోయింగ్, లాక్హీడ్, రేతియన్ వంటి దిగ్గజ కంపెనీలకు లాభాల పంట పండిచేందుకు 300 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను భారత్కు విక్రయించే బదులు పర్యావరణ పరిరక్షణలో భారత్ను భాగస్వామిగా చేయడంపై దృష్టి సారిస్తే బావుండేదని శాండర్స్ హితవు పలికారు.
మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరఫున తిరిగి బరిలో ఉండేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రిపబ్లికన్ల తరఫున తిరిగి ట్రంప్ నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డెమొక్రాట్లలో మాత్రం పోటీ ఉంది. ఒకవేళ బెర్నీ శాండర్స్ కు అవకాశం వస్తే.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తో తలపడతారు.