చైనా విద్యార్థుల వీసాల విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో మే 29 నుంచి సెప్టెంబరు 8 మధ్య వెయ్యి మందికి పైగా చైనీయుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా ప్రకటించింది.
డ్రాగన్ దేశం నుంచి అమెరికాకు వస్తోన్న విద్యార్థులు, పరిశోధకులకు ఆ దేశ ఆర్మీతో సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇటువంటి వ్యక్తులు తమ దేశానికి చెందిన సమాచారాన్ని చోరీ చేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా పేర్కొంది.
చట్టవ్యతిరేక వ్యాపార పద్ధతులతో అమెరికా మేధో సంపత్తితోపాటు కరోనా వైరస్ పరిశోధనా సమాచారాన్ని చోరీ చేసేందుకు చైనా విద్యార్థుల వీసాలను డ్రాగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది.
హాంకాంగ్లో డ్రాగన్ దేశ చర్యలను నిరోధించే చర్యల్లో భాగంగా మే 29న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన కింద ఈ వీసాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. తమ దేశ చట్టాలకు లోబడి వచ్చే విద్యార్థులకు మాత్రం అమెరికా ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని చెప్పారు.