రాష్ట్రంలో అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ కాంగ్రెస్ నేతలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక చాలామంది సినీ ప్రముఖులు #SaveNallamala అనే హ్యాష్ట్యాగ్తో తమ గళం వినిపించారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరిపితే పర్యావరణం దెబ్బతినటంతో పాటుగా సమీప రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అందరూ కూడా ఏకమవ్వడంతో.. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. యురేనియం తవ్వకాలకు తాము అనుమతించలేదని.. రైతులకు, పర్యావరణానికి నష్టం వాటిల్లే నిర్ణయాలకు తమ మద్దతు ఎన్నడూ ఉండదని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం కర్నూలు వేదికగా సాగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం కోసం డ్రిల్లింగ్ మొదలైందని ఓ జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ వార్తను ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్.. ”ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం కోసం డ్రిల్లింగ్ జరుగుతోందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. ఏపీ సర్కారుకు తెలియకుండా ఇదెలా జరుగుతుంది? జిల్లా కలెక్టర్కు ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యం కలుగుతోంది” అని పేర్కొన్నారు. నల్లమల పరిసర ప్రాంతంలో ఉండే ప్రజలకు తాము అండగా ఉంటామని.. వారి తరపున పోరాటం చేయడానికి జనసేన ఎల్లప్పుడూ సిద్ధమేనని పవన్ కళ్యాణ్ భరోసానిచ్చారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం యాదవాడలో యురేనియం నిక్షేపాల గుర్తింపు కోసం సర్వే చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి అఖిలప్రియ అక్కడికి చేరుకొని రైతులకు సమాచారం ఇవ్వకుండా పొలాల్లో సర్వే చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి ఉందని బుకాయించిన సర్వే సంస్థ ప్రతినిధులు, తమకేమీ తెలియదని, అనుమతి ఇవ్వలేదని తప్పించుకోబోయిన అధికారులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ , కాంగ్రెస్ దొందూ దొందే: హరీష్ రావు