telugu navyamedia
రాజకీయ

వివాదస్పదంగా యూపీ సీఎం యోగి వ్యాఖ్యలు

బీజేపీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‘అబ్బాజాన్‌’ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యూపీలోని ఖుషీనగర్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్‌ అబ్బాజాన్‌ అని మాట్లాడేవారందరూ 2017కి ముందు రేషన్‌ని బొక్కేశారంటూ ముస్లింలను పరోక్షంగా టార్గెట్‌ చేశారు.

ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు రేషన్‌ అందుతున్నట్టుగా అప్పట్లో అందలేదని, ఖుషీనగర్‌ రేషన్‌ నేపాల్, బంగ్లాదేశ్‌లకు తరలిపోయేదన్న యోగి ప్రస్తుతం నిరుపేదలకు చెందిన నిత్యావసర సరుకుల్ని ఎవరైనా మింగేయాలని చూస్తే ఊచలు లెక్కపెడతారని హెచ్చరించారు.

అబ్బాజాన్‌ అని మాట్లాడేవారందరూ అంటూ యోగి పరోక్షంగా ముస్లింలను టార్గెట్‌ చేయడం వివాదానికి దారి తీసింది. ఇలా విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడేవారు యోగి ఎలా అవుతారని ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.

ట్విటర్‌ వేదికగా పలువురు నేతలు యోగిని ఎండగడుతున్నారు. ఈ దేశం హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మతాలు, వర్గాలు, కులాలకు చెందినదని.. రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని జేడీ(యూ) అధ్యక్షుడు, ఎంపీ లలన్‌ సింగ్‌ యోగికి హితవు చెప్పారు.

Related posts