ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలనపై స్పందిస్తూ ఆయనకు కొన్ని హెచ్చరికలతో కూడిన సూచనలు చేశారు. అదమరిస్తే అంతే సంగతులు అంటూ జాగ్రత్తలు చెప్పారు. 151 సీట్లు వచ్చాయన్నది అశాశ్వితమని, అది శాశ్వతమని అనుకోవద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో అసమ్మతి ఉంటే పరిష్కరించటానికి డిల్లీ ఉందని, కానీ వైసీపీలో అన్నిటికి రాజకీయ కేంద్రం జగన్మోహనరెడ్డి మాత్రమేనని అన్నారు. అధికార పార్టీ అధినేత గా, ముఖ్యమంత్రిగా, పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తిగా జగన్మోహనరెడ్డి ఒక్కరే ఉన్నారని, అప్రమత్తతగానే కాదు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ చరిత్రలో రెండే సార్లు ఇదే తరహాలో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని గుర్తు చేసారు.
ఏపీ చరిత్రలో ఎప్పుడు అత్యధిక ఆధిక్యతతో ఎవరు విజయం సాధించి అధికారంలోకి వచ్చినా ఆ అధినేతలపై ఏదోరకంగా తిరుగుబాట్లు జరిగాయని ఉండవల్లి గుర్తు చేసారు. ప్రజలతో పాటుగా తన పార్టీ ఎమ్మెల్యేలలో సైతం ముఖ్యమంత్రి మీద మంచి అభిప్రాయం ఉండేలా, వారు అలా దానిని కొనసాగించాలేలా చూసుకోవటానికి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన అనుక్షణం ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. జగన్ చెబుతున్న నవరత్నాల్లో చిన్న తేడా వచ్చినా తన పార్టీ నేతలే వ్యతిరేకంగా పని చేస్తారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ప్రజల చేత ఏదురులేని రాజకీయాధికారం అందుకున్న ఎన్టీఆర్ మీద స్వయానా ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేస్తారని ఎవరైనా ఊహించారా? అని ఉండవల్లి ప్రశ్నించారు. ఇక విద్యుత్ ఛార్జీలు, ఇసుక కొరత రెండింటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.