చంద్రబాబు యూరప్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఉండవల్లిలోని ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ఈ ప్రజా వేదికను తమకు కేటాయించాలని గతంలో జగన్కు చంద్రబాబు లేఖ రాశారు. అయితే ఈ లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రజా వేదికను స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయించింది. టీడీపీకి సంబంధించిన సామాగ్రిని తీసుకుని వెళ్లాలని నేతలకు సీఆర్డీయే అధికారులు సూచించారు.
ఈ వ్యవహారం పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆందోళన చేపట్టారు. తనకు కనీస మాత్రమైనా సమాచారం ఇవ్వకపోవడంపై రెవెన్యూ అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. ప్రజావేదికలో చంద్రబాబు వ్యక్తిగత చాంబర్ కూడా ఉందని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ప్రజావేదికను స్వాధీనం చేసుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఇది ప్రభుత్వం దుర్మార్గపు చర్యని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.