గత ఏడాది చిన్న చిత్రంగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చక్కటి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోగా నటించిన నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు. ఈ చిత్రంలో మిస్టీరియస్ కేసుల్ని ఛేదించే డిటెక్టివ్ ఏజెంట్ ఆత్రేయగా నవీన్ ఆకట్టుకున్నాడు. ఇప్పుడీ ఏజెంట్ మరిన్ని కొత్త కేసుల్ని ఛేదించేందుకు తిరిగి తెరపై అడుగు పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ప్రకటించారు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు.
”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నుంచి మరో రెండు భాగాలు రానున్నాయి. వీటిలో ‘ఏజెంట్ ఆత్రేయ’ మరికొన్ని మిస్టీరియస్ కేసుల్ని ఛేదించబోతున్నాడు. ప్రస్తుతం దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జె ఈ స్క్రిప్ట్స్ను సిద్ధం చేస్తున్నారు. అవి పూర్తయి కరోనా కల్లోలం తగ్గగానే షూటింగ్ మొదలు పెడతాం’ అని రాహుల్ చెప్పారు. ఈ సీక్వెల్స్ లో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించే అవకాశం ఉంది. కాగా తొలి ‘ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ‘ హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ అవనుంది. ఇందుకు గాను రీమేక్ హక్కులు విక్రయించారు. కాగా ఈ సినిమాను జపనీస్ భాషలోకి డబ్ చేసి సెప్టెంబరు 11న విడుదల చేయనున్నారు.
previous post