విశాఖ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటన లో ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. పెదబయలు మండలం పి. కొండాపల్లి గ్రామానికి సమీపంలోగల అడవుల్లో శనివారం తెల్లవారుజామున ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ జవాన్లు పెదబయలు మండలంలోగల అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడడంతో అటు పోలీసులు ఇటు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా ఓ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్ను చికిత్స నిమిత్తం విశాఖకు తరలించారు. అలాగే ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ను ముమ్మరం చేశారు. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.